తెలుగు ఆటయె చూపించు వెలుగుబాట
తెలుగు మాటయె చెవినించు తేటిపాట
తెలుగు పాటయె రుచిమించు తేనె ఊట
తెలుగు పద్యమ్మె గెలిపించు తెలుగు బాల !

కొన్ని వేల పద్యాలు, పాటలు, మాటలు అందించగలిగే ధైర్యం ఒక్క తెలుగు ఆట అందిస్తుంది. అదే వైకుంఠపాళి. తెలుగు తోటలో పండిన విక్రమకేళి. దీన్నే ఆధ్యాత్మిక పరిభాషలో “పరమపద సోపాన పటము” అంటారు. కొన్ని ప్రాంతాల్లో “పాము పటం” అంటారు.

గాలి పటాలతో ఆడటం తప్ప పాము పటాలతో ఆడే ధైర్యం ఇప్పటి పిల్లలకు నేర్పడం లేదు కానీ ఈ వైకుంఠపాళి ఆడిన వాళ్ళెవరూ ఆత్మహత్యలకు పాల్పడరు. నిరాశ నిస్పృహలకు లోనుకారు.

కేవలం నాలుగు గవ్వలతో మూడో, నాలుగో చింత పిక్కలతో జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగువారి సృష్టి, తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.

ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో “పరమపద సోపాన పటము” అని 11 అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధర సింహాసనమై, నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై…. సిరి భార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్యపురుషుల మధ్యలో శ్రీమహావిష్ణువు కొలువై యుంటాడు. చివరకు చేరుకోవాల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనేవరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుండి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకొనేవరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.

పదకొండు అంటే దేవభాషలో ఏకాదశి. ఏకాదశీ వ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాశం, జాగరణం, దైవస్మరణ అనే మూడూ తప్పనిసరి. అలా 11 సంవత్సరాలు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం.

ఈ ఆధ్యాత్మిక మార్గాన్నే భౌతికంగా ఒక ఆట రూపంలో వైకుంఠపాళి ప్రదర్శిస్తుంది. ఆట ఆడటం భౌతిక ప్రయోజనం. గెలుపోటములు మానసికానుభూతి. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్థం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. నీ ముక్తి నీ చేతిలో ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలిగినన జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.

ఇందులో ప్రతి గడిలోను ఏదో ఒక బొమ్మ, దానికో పేరు కచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటిస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ పాములు బెదిరిస్తాయి. అంతలో ఉత్సాహం, అంతలోనే నిరుత్సాహం, అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచే తీరు.

ఈ ఆటలో పాములున్న గడుల్లో పేర్లు, నిచ్చెనలున్న గడుల్లో పేర్లు నిశితంగా పరిశీలిస్తే అద్భుత జీవన మార్గాలు, అపూర్వ ఆధ్యాత్మిక రహస్యాలు గోచరమౌతాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల ఉంటుంది. అక్కడ ‘కరోటకుడు’ అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ వేసి ఉంటుంది. పాము కరవడం వల్ల క్రిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందై పుడతావనేది ఆధ్యాత్మికమైన హెచ్చరిక.

అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉంటుంది. అక్కడ ‘దుర్యోధనుడు’ అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు క్రిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. జీవితంలో దుర్యోధనుడిలా అసూయగ్రస్తుడవైతే బాణాలతో భయంకరమైన యుద్ధంలో నువ్వూ, నీవాళ్ళూ మరణిస్తారనేది మరవలేని హెచ్చరిక.

పాముల అమరిక ఇంత అర్థవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగుభాగం ఉంటుంది. అక్కడ ‘భక్తి’ అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడివరకు సాగుతుంది. అక్కడ ‘బ్రహ్మలోకము’ అని ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. నిచ్చెన ఎక్కడం వల్ల పైకి ఎగబ్రాకడం అనేది పై పై విషయం. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయం అనేది లోతైన ఆధ్యాత్మిక రహస్యం.

అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ ‘చిత్తశుద్ధి’ అని రాసి ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ ‘మహాలోకము’ అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబ్రాకవచ్చు. ఇదంతా పైకి ఆశపెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్థం. ఇప్పటి భాషలో చెప్పాలంటే లోకంలో మహానుభావుడిగా కీర్తింపబడతావని విశేషార్థం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్న వయస్సులోనే ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.

ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్తపడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో ‘అరుకాషుడు’ అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం క్రిందికి జారి మొదటి గడిలోకి అంటే ‘కోతి’ లోకి వచ్చి పడతాడు. అంటే లోకంలో మహానుభావుణ్ణి (సెలబ్రిటి) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒక్కటి వేయడం) చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ‘ఒకటి’ని ‘గ్రుడ్డి’ అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గ్రుడ్డి పని చేసినా మళ్ళీ క్రిందికి జారిపోవడం తప్పదని చెప్పడం.

ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!

ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది. చిట్టచివర 121 వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దాని పేరు ‘అహంకారం’. దానితోక 99 వ గడిలోకి ఉంటుంది. అక్కడ రాక్షసుని బొమ్మ ఉంటుంది. అంటే 106 లో అరుకాషుణ్ణి దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరలో 121 లో అహంకారానికి లోనయితే తిరిగి రాక్షసజన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మరుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్య కశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలుకావడానికి ఈ ‘అహంకారమే’ కారణం గదా!

అంతిమంగా అహంకారం, మమకారం అనే రెంటినీ జయించినవాడే పరమపదం చేరుకోగలడని సారాంశం.

“జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయీ!
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి.
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పోవోయి”

ఈ పాత చలనచిత్రం గీతం ఒక ప్రాచీన శ్లోకంలా, ఒక ప్రబంధ పద్యంలా, ఒక భావకవితలా, ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెవుల్లో మారుమ్రోగుతూ గెలుపుకోసం వెన్నుతడుతూనే ఉంటుంది.